ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి తో బస్సు యాత్ర చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి యువత ఆకర్షితం అవుతారని భావిస్తున్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా పాదయాత్ర చేస్తామని టిడిపి నాయకులు గట్టిగా చెప్తున్నారు. అయితే పాదయాత్రని ఎలా అయినా అడ్డుకొని తీరాలి అని వైసిపి వ్యూహాలు వేస్తుంది. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ చేయబోయే బస్సు యాత్రకు కూడా ఆటంకం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికార బలంతో ప్రతిపక్షాల యాత్రలకి ఎలా అయినా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు జనంలోకి బలంగా వెళ్తే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంది.
అలాగే ప్రజలను కూడా ప్రభావితం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడల కారణంగా అధికార పార్టీ బాగా వర్రీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు దాడి కూడా పెంచింది. అయితే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ కచ్చితంగా ఉంటుందని భావిస్తున్న వైసీపీ అధిష్టానం మరింత బలంగా తమ పాలనపై ప్రజలకి నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలని భావిస్తుంది. వైసిపి ఎమ్మెల్యేలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సంక్షేమ పథకాలపై కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజల నుంచి మాత్రం చాలామంది ఎమ్మెల్యేలకు ప్రతిఘటన ఎదురవుతుంది.
ఈ నేపథ్యంలో ముందుగా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి రహదారుల నిర్మాణం చేపట్టడానికి సిద్ధమవుతుంది. దీనికి ఇప్పటికే వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ఆరు నెలల కాలంలో రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసి ప్రజలకు సక్రమంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. దీని తర్వాత జిల్లాల వారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. తమ అభివృద్ధి కార్యక్రమాలను అన్ని కూడా నేరుగా తానే ప్రజలకు తెలియజేయాలని అందుకోసం జిల్లాల వారీగా సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ బహిరంగ సభలు ఎలా నిర్వహించాలని వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది.