YS Jagan: ఏపీ రాజకీయాలలో ముఖ్యమంత్రి వైఎస్ వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా తన కార్యాచరణ అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి మీటింగ్ లు పెట్టి క్లాస్ లు తీసుకుంటూ వారికి నేరుగానే వార్నింగ్ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలిచే వారికే టికెట్లు ఇస్తానని ఘంటాపథంగా చెబుతున్నారు. కచ్చితంగా గ్రౌండ్ లోకి వెళ్లి పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరి రిపోర్ట్ తన దగ్గరకి వస్తుందని, వాటి ఆధారంగానే అభ్యర్ధుల ఖరారు అనేది ఉంటుందని కూడా చెబుతున్నారు. నిజానికి వైఎస్ జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కంటే తాను ఏర్పాటు చేసుకున్న వాలంటీర్లని, అలాగే ఐప్యాక్ టీమ్ ని బలంగా నమ్ముతున్నారు.
గత ఎన్నికలలో గెలవడానికి ఐ ప్యాక్ టీమ్ సహకారమే కారణం అని జగన్ విశ్వసించడంతో ఈ సారి కూడా వారినే గుడ్డిగా ఫాలో అవుతున్నారనేది చాలా మంది చెప్పే మాట. ఇక ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో చాలా అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. తమ మాట వినడానికి కూడా జగన్ సిద్ధంగా లేరని తమ సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. సంక్షేమ పథకాలతో డబ్బులు పంచిపెట్టాం కాబట్టి మనమే గెలిచేస్తాం అని మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా కూడా జగన్ కి ఎక్కడో ఇంకా తన ఎమ్మెల్యేలల విషయంలో నమ్మకం లేదని టాక్.
ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు అసమ్మతి స్వరం వినిపించి బయటకి వెళ్ళిపోయారు. ఈ నేపధ్యంలో ఎన్నికల ముందు టీడీపీ, జనసేనలో టికెట్లు ఖరారు చేసుకొని కొంత మంది జంప్ అయిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే వారు ఎవరనేది మాత్రం జగన్ గుర్తించలేకపోతున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. బయటకి వెళ్ళిపోయిన వారు కచ్చితంగా పార్టీకి ఎంతోకొంత నష్టం చేసే వెళ్తారు. మరి అలాంటి వారి విషయంలో ఎలా జాగ్రత్త పడాలి అని ఆలోచిస్తున్నారు. అందుకనే ఎమ్మెల్యేలు కంటే జగన్ పార్టీ క్యాడర్ పైన ఎక్కువ ఆధారపడుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట