ఆదిత్యను అస్తమానం కలవడం పద్ధతి కాదమ్మా అని రామ్మూర్తి అనడంతో అసలు నిజం చెప్పేస్తుంది రాధ. దాంతో తన మంచి తనానికి చేతులెత్తి దండం పెడతాడు రామ్మూర్తి. ఆ తర్వాత దేవి ఆఫీసర్ సారు ఇంట్లో హడావుడి చేస్తుంది. దేవుడమ్మతో కలిసి బయటికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం..
మాధవ్ మా నాయన కాదని దేవి చెప్పడంతో సత్య ఫోన్ చేసి అడుగుతుంది. నా బిడ్డ అలా అందా? ఇంతకంటే దారుణం మరొకటి లేదు అంటూ నాటకమాడతాడు మాధవ్. ఆదిత్య, రాధలు దేవితో అలా చెప్పించి ఉంటారని అబద్ధం చెప్తాడు మాధవ్. ఇంకా ఇలాగే ఉంటే రేపు నా భార్య కూడా నన్ను భర్త కాదు అంటుంది. నా కాపురాన్ని నిలబెట్టు సత్య అని వేడుకుంటాడు.
ఆ తర్వాత ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి దేవి ఇక్కడికి వచ్చింది. అమ్మతో కలిసి బయటికి వెళ్లిందని చెప్తాడు. అమ్మ నిన్ను వెతకడానికి నీ ఫొటో తీసుకుని వెళ్లిందని చెప్పి కంగారు పడతాడు. వెళ్లే దారిలో అమ్మ నీ ఫొటో దేవికి చూపిస్తే ఏమవుతుందోనని భయమేస్తుంది. నువే ఏదో ఒకటి చేయి రుక్మిణి అని కోరుకుంటాడు ఆదిత్య. తెలిస్తే తెలియనియ్ పెనిమిటి. నీకు కావాల్సిందే జరుగుతుంది. మనం చెప్పలేకపోతున్నది దేవే తెలుసుకుంటుంది అంటుంది రాధ. మరి నీ సంగతేంటి అని అడగ్గా.. మౌనంగా ఫోన్ కట్ చేస్తుంది రుక్కు. సత్యకు అనుమానం రాకుండా చూసుకోవాలి లేకపోతే నేనే అందరి దగ్గర మాటపడాల్సి వస్తుంది అనుకుంటాడు మాధవ్.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ రుక్మిణి ఫొటో దేవికి చూపించి ఇదే నా పెద్ద కోడలు అంటుంది. నీ పెద్ద కోడలు కనిపిస్తే ఏం చేస్తావ్ అవ్వా అని దేవి ప్రశ్నించగా ఇంటికి తీసుకెళ్తానని బదులిస్తుంది దేవుడమ్మ. మరి సత్య పిన్నికి ఇబ్బంది కాదా అని అడగ్గా.. ఇబ్బంది ఏముంది ఇద్దరు అక్కా చెల్లెళ్లె కదా.. నేను సర్ది చెప్పుకుంటాను అంటుంది దేవుడమ్మ. అయినా ఊళ్లో అందరికి న్యాయం చెప్పే దేవుడమ్మ కోడల్లకు అన్యాయం చేస్తానా? అంటుంది. నీ కోడలు నాకు ఎరికె అని దేవి చెప్పగా ఎలా అని నోరెళ్లబెడుతుంది దేవుడమ్మ. నేను నీ పెద్ద కోడలి బిడ్డను కాబట్టి అని చెప్పి డైరెక్ట్గా ఇంటికే తీసుకెళ్తుంది దేవి.
రుక్కు, దేవుడమ్మ ఒకరినొకొరు చూసుకొని షాకవుతారు. గతాన్ని గుర్తుచేసుకుంటుంది దేవుడమ్మ. నా ఇంట్లో రుక్మిణిగా చనిపోయి ఈ ఇంట్లో రాధగా బతుకుతుందా? అంటూ సరాసరి కోడలి దగ్గరికి వెళ్తుంది దేవుడమ్మ. అత్తమ్మ అది అని రుక్కు చెప్పేలోపే కోడలి చెంపపగలగొడుతుంది దేవుడమ్మ. ‘చావకుండా చచ్చానని చెప్పి ప్రతిరోజు నేను చచ్చేలా చేసి ఇక్కడ చాటుగా బతుకుతున్నావా’ అంటూ కోప్పడుతుంది. అమ్మా రాధ గురించి తెలియక మాట్లాడుతున్నారు? అని రామ్మూర్తి అంటాడు. ఇంకేం తెలియాలి నా బిడ్డని వదిలేసి వచ్చి పరాయి వాడి ఇంట్లో పరాయి వాడి భార్యగా బతుకుతుంది అని అరుస్తుంది దేవుడమ్మ. ఎవరు చెప్పినా వినిపించుకోదు దేవుడమ్మ. నా ఇంటి దేవత అనుకున్న రుక్మిణి మరో పెళ్లి చేసుకుని మమ్మల్ని మోసం చేసిందంటూ నిలదీస్తుంది. ఇన్నాళ్లు నా కంటికి కనిపించకుండా ఎందుకు తిరుగుతుంది. మాధవ్తో తాళి కట్టించుకుందని అంటుంది.. ఇపుడు నా దృష్టిలో నిజంగానే చచ్చావ్ అని అసహ్యించుకుంటుంది కోడల్ని. నా కోడలు రుక్మిణి చచ్చిపోయిందని అరుస్తుంది. తర్వాత అదంతా కారులో కూర్చుని కలగంటుంది దేవి. నిజం తెలిస్తే జరిగేది ఇదేనేమో అనుకుని భయపడిపోతుంది దేవి. ఆ తర్వాత ఇంటి ముందు కారు ఆపమని దిగిపోతుంది దేవి. అమ్మా నాన్నల్ని కలపడానికి ఏం చేస్తుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..