Over Weight : ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. దీనిని తగ్గించుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం వ్యాయామం, ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలోని క్యాలరీలలో కోత విధిస్తుంటారు. అయితే కోత విధిస్తే చాలదని తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తత చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోవాలని.. సరైన జీవనవిధానం పాటించడం మొదలైన నియమాలు పాటించాలన్నారు. ఇందుకోసం ఆయుర్వేద ఆహారపుటలవాట్లు కూడా కొంతమేరకు తోడ్పడతాయి.
Over Weight : ఈ డ్రింక్ జీర్ణశక్తి, మలబద్ధకాన్ని నివారిస్తుంది..
ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో వేయించిన మెంతులు కలిపి పరగడుపున తాగాలి. ఈ డ్రింక్ జీర్ణశక్తికీ, మలబద్ధకం నివారణకూ తోడ్పడుతుంది. త్రిఫల చూర్ణం కూడా అధిక బరువును తగ్గిస్తుంది. మూడుపూటలా తీసుకునే ఆహారంలో చాలా మార్పులు చేర్పులు చేసుకోవాలి. రాత్రి ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఇక మధ్యాహ్న భోజనం మాత్రం తగినంత తీసుకోవచ్చు. అయితే కూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనన్ని ఎక్కువ క్యాలరీలను మధ్యాహ్న భోజనం ద్వారా తీసుకోవడం మూలంగా దాన్ని పూర్తిగా జీర్ణం చేసుకుని, పోషకాల శోషణతో శక్తిని సమకూర్చుకోగల సమయం జీర్ణవ్యవస్థకు చిక్కుతుంది. ఇక రాత్రి వేళ మితంగా ఆహారం ఎందుకు తీసుకోవాలంటే.. అజీర్తికి, ఉబ్బరానికి తావు లేకుండా చూసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.
మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్, కొవ్వులు, పిండిపదార్థాలు సరిపడా తీసుకోవాలి. దీనికోసం అన్నం, పప్పు, కూరలు, సలాడ్స్ తీసుకోవచ్చు. అంతే కాకుండా మన మధ్యాహ్న భోజనంలో నెయ్యి, పెరుగు కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజు మొత్తం రెండు నుంచి మూడు లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అధిక బరువు తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. గోరువెచ్చని నీళ్లు కొవ్వును విరిచి, మాలిక్యూల్స్గా మారుస్తాయి. అంతేకాదు.. గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడం వలన లాభాలు అపారం. జీర్ణవ్యవస్థ వీటిని శక్తిగా వాడుకోగలుగుతుంది. గోరువెచ్చని నీళ్లతో మెటబాలిజం కూడా పెరుగుతుంది. భోజనానికి అరగంట ముందు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉండి, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరవు.